ఈటల పాదయాత్ర ప్రారంభం
వరంగల్ అర్బన్: నా పాదయాత్రకు అండగా ఉండేందుకు అనేక వర్గాల ప్రజలు, అన్ని యూనివర్శిటీలు విద్యార్థులు, నిరుద్యోగులు వచ్చారని బిజెపి నాయకుడు ఈటల రాజేందర్ తెలిపారు. ఈ పాదయాత్ర 25-26 రోజుల పాటు ప్రతి పల్లెను, ప్రతి గడపను కలిసేలా సాగుతుందన్నారు.
ప్రజా దీవెన యాత్రకు రాజేందర్ భార్య జమున విజయ తిలకం దిద్ది హారతి ఇచ్చారు. మాజీ ఎంపి జి.వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. బత్తినివాని పల్లెలో పాదయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ, ప్రజలందరూ నన్ను నిండు మనస్సుతో ఆశీర్వదించాలని కోరుతున్నాను. ఈ పాదయాత్ర పది రోజుల క్రితమే ప్రకటించామన్నారు. మా పాదయాత్రకు ఆటంకాలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగానిదేనని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. కానీ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. నిన్న ఓ రైస్ మిల్లును కార్యకర్తలకు భోజనాల కోసం మాట్లాడుకుంటే.. ఆయనను బెదిరించారు. ఓడిపోతామన్న భయంతో ఇలాంటి చిల్లర పనులు కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్నాయి. ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తే మీకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. మేము ఎలాంటి ప్రలోభాలను నమ్ముకోలేదు. ధర్మాన్ని, న్యాయాన్ని, ప్రజలను నమ్ముకున్నాం. కేసీఆర్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడటం ఇక్కడి నుంచే మొదలవుతుందని ఈటల రాజేందర్ అన్నారు.
హుజురాబాద్ లో ప్రచారం చేస్తున్న ఇతర ప్రాంతాల ఎమ్మెల్యేలు మీకు దమ్ముంటే ముందు మీ దగ్గర పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. యావత్ తెలంగాణ ప్రజలు విముక్తి కావాలంటే తొలి అడుగు ఇక్కడినుంచే పడాలని ప్రజలు భావిస్తున్నారు. ఇక్కడ మాకు అడ్డంకులు సృష్టించాలని, నీచపు పనులు చేయాలని చూస్తే ఖబర్ధార్ అని హెచ్చరించారు. ప్రజలను భయబ్రాంతులకు గురిచేయాలని చేయడం సరికాదు. చిల్లర వేషాలు వేసేవారిని వదిలిపెట్టమని రాజేందర్ వార్నింగ్ ఇచ్చారు.