నిరుద్యోగులపై నిర్బంధం అమానుషం: లోకేష్
అమరావతి: నిర్బంధాలను, అక్రమ అరెస్టులను ఎదురొడ్డి మరీ నిరసన తెలిపిన యువత ఉద్యమస్ఫూర్తిని అభినందిస్తున్నానని ఎమ్మెల్సీ నారా లోకేష్ తెలిపారు. అక్రమ అరెస్టులతో యువతని అడ్డుకోవాలని చూసినా అసాధ్యమైపోయిందన్నారు.
కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన తాడేపల్లిలో సిఎం ఇల్లు ముట్టడి కార్యక్రమంలో మీ నిర్బంధాలను, అక్రమ అరెస్టులను ఎదురొడ్డి మరీ నిరసన తెలిపిన యువత ఉద్యమస్ఫూర్తిని అభినందిస్తున్నాను. కొంతమంది పోలీస్ అధికారులు… అధికార పార్టీ కార్యకర్తల కంటే దిగజారి పనిచేయడం విచారకరమన్నారు. అరెస్ట్ చేసిన విద్యార్థి, యువ నేతలందరినీ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వైసిపి రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారు…
నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఎక్కడ జగన్ రెడ్డి గారు? అని ప్రశ్నించారు. నిరుద్యోగుల ఉద్యమాన్ని నిర్బంధంతో అణచివేయలేరన్నారు. లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని భ్రమలు కల్పించి, నేడు వందల ఉద్యోగాలు కూడా ఇవ్వలేని మీ అరాచకపాలన.. అక్రమ అరెస్టులతో యువతని అడ్డుకోవాలని చూసినా అసాధ్యమైపోయిందని లోకేష్ తెలిపారు. మీ రెండేళ్ల పాలనలో నిరుద్యోగులకు జరిగిన అన్యాయం, యువతకి జరిగిన మోసంపై పోరాడేందుకు వివిధ విద్యార్థి, నిరుద్యోగ, యువ సంఘాలన్నీ కలిసి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితిగా ఏర్పడి, మీ నియంత పాలనపై పోరుబాట పట్టాయన్నారు.
ఆర్టికల్ 19 ప్రకారం తమకు జరిగిన అన్యాయంపై ప్రజలకు నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించింది. దానిని కాలరాసే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు?. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన చలో తాడేపల్లి కార్యక్రమానికి అనుమతి ఇవ్వకపోవడం నిరంకుశ పాలనలోనే జరుగుతుందన్నారు. నిరుద్యోగ యువత నిరసన తెలిపితే కేసులు పెట్టి భవిష్యత్తు దెబ్బతీస్తామని స్వయంగా గుంటూరు ఎస్పీ బెదిరించడం రాష్ట్రంలో అరాచక పాలనకి నిదర్శనమని లోకేష్ దుయ్యబట్టారు. ఇవాళ ఎన్ని నిర్బంధాలు ఎదురైనా, ఎంతమందిని గృహనిర్బంధం చేసినా..సీఎం ఇల్లు యువత ముట్టడించిందన్నారు. అరెస్ట్ చేసిన విద్యార్థి, యువ నేతలందరినీ తక్షణమే విడుదల చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు.