హైదరాబాద్ దంత వైద్యుని కిడ్నాప్ వెనుక అసలు కథ ఇది..
హైదరాబాద్ దంత వైద్యుని కిడ్నాప్ వెనుక అసలు కథ ఇది..
యాక్షన్ సినిమాను తలపించే రీతిలో అనంతపురం జిల్లా పోలీసులు ఛేజ్ చేసి పట్టుకున్న కిడ్నాప్ గ్యాంగ్ వ్యవహారం వెనుక అసలు కారణాలు వెలుగు చూస్తున్నాయి. మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్ బండ్ల గూడలో దంత వైద్యున్ని హుస్సేన్ ను బుర్ఖా ధరించిన వారు కిడ్నాప్ చేశారు. ఈ కిడ్నాపర్లు వైద్యునికి గోర్లు పీకేసి, కత్తులతో కోసి నరకయాతన చూపించారు. అయితే ఈ కిడ్నాప్ కు పాల్పడింది.. మహారాష్ట్ర, పూణే. కర్ణాటక గ్యాంగ్ లు. అయితే చేయించింది మాత్రం బాధితుని భార్య సమీప బంధువులే. కిస్మత్పుర గ్రామంలో నివాసముంటున్న దంతవైద్యుడు బెహజాత్ హుస్సేన్ బండ్లగూడలో ఇటీవల మూడు అంతస్తుల భవనం నిర్మాణం పనులు చేపట్టారు. గ్రౌండ్ ఫ్లోర్లో డెంటల్ క్లినిక్ను ఇటీవల ప్రారంభించారు. అయితే ఆస్ట్రేలియాలో ఉండే హుస్సేన్ భార్య సమీప బంధువు ముస్తాఫా రెండు నెలల కింద హైదరాబాద్ వచ్చాడు. ఆ సమయంలో బండ్లగూడలోని హుస్సేన్ డెంటల్ క్లినిక్పై అంతస్తులోని ఫ్లాట్లు అద్దెకు ఉన్నాయని ముస్తాఫా తెలుసుకున్నాడు. అయితే ఆస్ట్రేలియాలోని ఓ కంపెనీ ఆర్థిక సలహాదారుగా పనిచేసే ముస్తాఫా అక్కడ విలాసవంతమైన జీవనానికి అలవాటుపడి బ్యాంకుల్లో చాలా రుణాలు చేశాడు. అవి చెల్లించలేక 2019 మార్చిలో భారత్కు తిరిగి వచ్చాడు. పుణే, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని భావించి ఆస్ట్రేలియాలో తనతో పాటు పనిచేసిన ముబసిర్ అహ్మద్ అలియాస్ కాలేద్తో కలసి ఆయా ప్రాంతాల్లో తిరిగాడు. అయితే చాలా అప్పులు ఉండటంతో ఎలాగైనా సులువుగా డబ్బు సంపాదించేందుకు హుస్సేన్ను కిడ్నాప్ చేసి డబ్బులు లాగొచ్చని పథకం రచించినట్లు తెలిసింది. అయితే ఈ కిడ్నాప్ కు అనంతపురం పోలీసులు చెక్ పెట్టడం అభినందనీయం.